కరోనా…చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. గబ్బిలాల వల్ల ఈ పిశాచి వైరస్ ప్రపంచానికి పరిచయమైందని కొందరు….పాంగోలిన్ అనే జంతువు వల్ల ఈ వైరస్ బయటపడిందని మరికొందరు వాదిస్తున్నారు. అయితే అసలు జంతువుల వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందలేదని మరో వాదన ఉంది. ఇక వుహాన్ లోని చేపల మార్కెట్ లో ఈ వ్యాధి పురుడు పోసుకుందని …తొలి కరోనా కేసు కూడా అక్కడ నుంచే నమోదైందని కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వుహాన్ లోని రొయ్యలమ్మే వుయ్ జుషాన్ అనే మహిళ దగ్గర నుంచి కరోనా వ్యాప్తి చెంది ఉంటుందని అనుమానిస్తూ లండన్ కు చెందిన ఓ ఆంగ్ల పత్రిక కథనంలో వెల్లడించింది. ఆ మహిళే కరోనా తొలి బాధితురాలు అయి ఉండవచ్చని అభిప్రాయపడింది. 57 ఏళ్ల వయసున్న ఆ మహిళ ద్వారానే ఆ మార్కెట్లో పనిచేసే మరి కొంతమందికి వైరస్ వ్యాప్తి చెందిందని అంచనా వేస్తోంది. తాను ప్రతి ఏడాది శీతాకాలంలో జలుబు దగ్గు వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుంటానని ఈ సారి కూడా అవే లక్షణాలుండడం తో పెద్దగా పట్టించుకోలేదని ఆ మహిళ చెప్పింది. తాను ఆసుపత్రిలో చేరిన తర్వాత మార్కెట్ కు చెందిన మరి కొందరు అవే లక్షణాలతో ఆసుపత్రిలో చేరడంతో ఈ వైరస్ గురించి ప్రపంచానికి తెలిసిందని చెప్పింది. ఆ మార్కెట్లోని కామన్ టాయిలెట్ నుంచి తనకు వైరస్ సంక్రమించి ఉంటుందని ఆ మహిళ అనుమానించింది. అయితే చైనా ప్రభుత్వం ఈ వైరస్ ను మొదట పెద్ద సీరియస్ గా తీసుకోలేదని అందుకే ఈ రోజు వేలాది మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ వైరస్ తొలిసారిగా గుర్తించిన 27 మందిలో ఆ మహిళ కూడా ఒకరని వుహాన్ మునిసిపల్ హెల్త్ కమిషన్ స్పష్టం చేసింది. అయితే ఆ 27 మందిలో 24 మంది మార్కెట్ తో సంబంధం కలిగిఉన్నారని ఆ 24 మందిలో ఆ మహిళ కూడా ఉందని చెప్పింది.కాగా కరోనా మొదటి బాధితురాలైన వుయ్ జుషాన్ నెల రోజుల చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడడం గమనార్హం..