మణిపుర్ అల్లర్లు.. పోలీసుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ సీబీఐ ఛార్జ్‌షీట్

మణిపుర్ అల్లర్లు.. పోలీసుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ సీబీఐ ఛార్జ్‌షీట్

ఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన మణిపుర్ అల్లర్ల కేసులో సీబీఐ ఛార్జ్షీట్ విడుదల చేసింది. ఇందులో మణిపుర్ పోలీసుల వైఖరి, వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అల్లరి మూకల దాడులు జరుగుతున్న క్రమంలో సాయం కోరడానికి వచ్చిన బాధితులను ఏ మాత్రం పట్టించుకోకుండా మూకలకు సహకరించారని ఛార్జ్ షీట్లో వెల్లడించారు. కాంగ్పోక్పి జిల్లాలో మైతేయ్ తెగల అల్లరి మూకల చేతికి చిక్కిన ఇద్దరు ఇతర తెగల మహిళలు.. సమీపంలో ఉన్న పోలీస్ జీపు వద్దకు చేరుకుని సాయం చేయాలని ప్రార్థించారు. అయితే పోలీసులే బాధితులను వారికి అప్పగించినట్లు ఛార్జ్ షీట్లో ఉంది. ఆ తరువాత 1000 మందికిపైగా సాయుధులు ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించారు. అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాల్లో ఒకరు కార్గిల్ యుద్ధ వీరుడి భార్య కాగా.. ఆమె తనను కాపాడాలని పోలీసులను కోరగా.. జీపు తాళాలు లేవని వారు అన్నట్లు చెప్పారు. సాయుధుల చేతిలో చిక్కుకున్న మరో మహిళ తృటిలో వారి నుంచి తప్పించుకుంది. 2023 మే 4న జరిగిన ఈ ఘటనలో మైతేయి, కుకీ జాతుల మధ్య హింస చెలరేగిన నెల తరువాత.. జులైలో సదరు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళలపై దాడి చేసిన గుంపులో 900-1,000 మంది వ్యక్తులు ఉన్నారని, వీరిలో చాలామంది AK, SLR, INSAS, రైఫిల్స్ వంటి అధునాతన ఆయుధాలను కలిగి ఉన్నారని ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఆ గుంపు మహిళలను వెంబడించడమే కాకుండా, కాంగ్పోక్పి జిల్లాలోని వారి గ్రామంలో విధ్వంసం సృష్టించి.. ఇళ్లన్నింటినీ తగులబెట్టాయి.
180కిపైగా మృతి..
మే 3న మణిపూర్లో హింస చెలరేగినప్పటి నుండి 180 మందికి పైగా మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపు 53 శాతం ఉన్నారు. వీరు ఎక్కువగా ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు, నాగాలు, కుకీలతో సహా గిరిజనులు 40 శాతం ఉన్నారు.వీరు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రెండు గ్రూపులైన మెజార్టీ మైతేయ్, మైనార్టీ కుకీ తెగల మధ్య భూమి, పలుకుబడి విషయంలో నెలకొన్న వివాదం జాతుల మధ్య హింసకు దారితీసి ఆ రాష్ట్రాన్ని గతేడాది తీవ్ర అంతర్యుద్ధంలోకి నెట్టేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos