టీవీ చర్చలతో మరింత కాలుష్యం

టీవీ చర్చలతో  మరింత కాలుష్యం

న్యూఢిల్లీ : టీవీ డిబేట్లు మిగిలినవారికన్నా ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులు చేసే స్వల్ప వ్యాఖ్యలను సైతం వివాదాస్పద అంశాలుగా మార్చుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఒక విద్యార్థి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్యం, పంట దుబ్బుల కాల్చివేత ప్రభావం పై సుప్రీం కోర్టును తాను తప్పుదోవ పట్టించినట్లు టీవీ డిబేట్లలో నిందిస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆక్రోశించారు. ‘‘మీరు ఓ సమస్యను ఉపయోగించు కోవాలనుకుంటున్నారు. దానిని మేం పరిశీలించే విధంగా చేస్తున్నాం. ఆ తర్వాత దానిని వివాదాస్పదం చేయాలనుకుంటున్నారు. అప్పుడు మిగిలేది ఒకరినొకరు నిందించుకోవడం మాత్రమే. టీవీల్లో డిబేట్లు మిగిలినవాటి కన్నా ఎక్కువ కాలుష్యం సృష్టిస్తున్నాయి’’ రమణ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో గాలి కాలుష్యానికి కారణం రైతులు తమ పంట వ్యర్థాలను కాల్చడమేనని ఆరోపించడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడాన్ని ప్రముఖులు సైతం సమర్థించడాన్ని గుర్తు చేసింది. జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, దేని వల్ల ఎంత శాతం కాలుష్యం వస్తోందనేదానితో సంబంధం లేకుండా, రైతుల దయనీయ స్థితిని గుర్తించాలన్నారు. రైతులు తమ పంట వ్యర్థాలను కాల్చవలసిన అవసరం ఎందుకు వస్తోందో ఎవరూ పరిశీలించడం లేదన్నారు. ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ సదుపాయాలుగల భవనాల్లో నివసించేవారు రైతులను నిందిస్తున్నారన్నారు. రైతులకుగల భూముల విస్తీర్ణం ఎంత? వారి భూముల నుంచి ఈ వ్యర్థాలను తొలగించడానికి తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడానికి తగిన వనరులు వారి వద్ద ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించడం లేదని పేర్కొన్నారు. ఏదైనా శాస్త్రీయ ప్ర్రక్రియ ఉంటే, దాని గురించి వారికి చెప్పాలన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, సూర్యకాంత్ వ్యాఖ్యలను సమర్థించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos