ఎలక్టోరల్ బాండ్ల దాతలు – గ్రహీతల వివరాలు రేపే వెల్లడించాలి

ఢిల్లీ: రాజకీయ పార్టీలకు కాసుల వర్షం కురిపించిన ఎలక్టోరల్ బాండ్ల దాతలు, గ్రహీతల సమాచారం ఇచ్చే గడువును పొడగించాలని ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ పిటిషన్పై విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. 26 రోజులు గడిచినా పూర్తి సమాచారం కోసం మరికొంత గడువు ఇవ్వాలని అడగడమేంటని ఎస్బీఐని జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. అలా అడగడం దేశంలోనే నంబర్ 1 బ్యాంకుగా ఉన్న ఎస్బీఐ నిజాయతీపై ప్రశ్నలు లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు. జస్టిస్ డీవై చంద్రచూడ్తో కలిపిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎస్బీఐ వినతిపై ఇలా స్పందించింది. “కొనుగోలుదారులు, రాజకీయ పార్టీల వివరాలన్నీ ముంబై మెయిన్ బ్రాంచిలో ఉన్నాయని అఫిడవిట్లో చెప్పారు కదా. అలాగే బాండ్ల కొనుగోలు దారులు, రాజకీయ పార్టీల వివరాలను మ్యాచ్ చేయాలని, అందుకు సమయం కావాలని కోరారు. మేం మ్యాచింగ్ చేసి వివరాలు వెల్లడించాలని ఆదేశించలేదు. మీ దగ్గర ఉన్నది ఉన్నట్టుగా సమాచారం ఇవ్వాలని మాత్రమే కోరాం. బాండ్లు కొన్నవారి వివరాలన్నీ సీల్డ్ కవర్లో ఉన్నాయని చెప్పారు. వాటిని తెరిచి వివరాలు ఇస్తే సరిపోతుంది. తమ వద్ద ఉన్న సమాచారాన్ని సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాం. వాటిని మేం తెరవలేదు. బాండ్ల రద్దుపై ఫిబ్రవర్ 15న తీర్పునిచ్చాం. ఇవాళ మార్చి 11. ఈ 26 రోజుల్లో ఏం చేశారో స్టేట్ బ్యాంక్ చెప్పలేదు. స్టేట్ బ్యాంక్ నుంచి మేం నిజాయతీ ఆశించాం. ప్రతి లావాదేవీకి కేవైసీ ఉంది. తప్పు జరిగే అవకాశం ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సీల్డ్ కవర్ తెరవాలని ఆదేశిస్తాం. స్టేట్ బ్యాంక్ మా ఆదేశాలు పాటించాలి. రాజకీయ పార్టీల వివరాలు అందించడానికి మూడు వారాల గడువెందుకు. బాండ్లు కొన్నవారి వివరాలు మీ వద్ద సిద్ధంగా ఉన్నాయి” అని కోర్టు పేర్కొంది. ఫిబ్రవరి 15న ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసింది. దీనిని “రాజ్యాంగ విరుద్ధం”గా పేర్కొంది. దాతలు వారు విరాళం ఇచ్చిన మొత్తం నిధులు, గ్రహీతల వివరాలను మార్చి 13 లోపు వెల్లడించాలని ఈసీని ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos