భోపాల్ : భోపాల్ లోక్సభ నియోజక వర్గం భాజపా అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ప్రచారంపై ఎన్నికల సంఘం 72 గంటల నిషేధాన్ని విధించడంతో ఆమె గురువారం ఆలయాల బాట పట్టారు. ఉదయం తన నివాసంలో ప్రజలను కలుసుకున్న అనంతరం భోపాల్లోని కర్ఫ్యూ వలి మాతా మందిర్కు వెళ్లారు. బాబ్రీ మసీదు విధ్వంసంలో తన పాత్రతో పాటు ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేకు వ్యతారేకంగా చేసిన వ్యాఖ్యల కారణంగా ఎన్నికల సంఘం 72 గంటల పాటు ప్రచారాన్ని సాగించరాదని ఆంక్షల్ని విధించటం తెలిసిందే. హేమంత్ కర్కరేపై ప్రకటనకు సాధ్వి క్షమాపణలు కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ను ఉగ్రవాదిగా అభివర్ణించినందుకు ఎన్నికల సంఘం ఆమెకు మూడో తాఖీదు జారీ చేసింది. మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన సాధ్వి ప్రజ్ఞా సింగ్ను బాజపా అభ్యర్థిగా బరిలో దిగినప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.