తిరుపతి: నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు సొంత పార్టీ నుంచే ఎదురుగాలి వీస్తోంది. రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక వైసీపీ నేతలే పార్టీని డిమాండ్ చేసే స్థాయిలో ఆమెపై వ్యతిరేకత నెలకొంది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో వైసీపీ అసంతృప్త నేతలు శుక్రవారం సమావేశ మయ్యారు. వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నగరిలో తాము ఐక్యంగా లేమని, అసంతృప్తితో ఉన్నామని ఆయన వెల్లడించారు. నగరిలో రోజా సోదరుల అక్రమాలు, దౌర్జన్యాలతో నష్టపోయామని తెలిపారు. కార్యకర్తలకు పదవులు కావాలన్నా డబ్బులు అడుగుతున్నారని మురళీధర్ రెడ్డి ఆరోపించారు. ‘రోజా వద్దు… జగన్ ముద్దు’ అనే నినాదంతో ముందుకెళతామని తేల్చి చెప్పారు. నగరిలో మంత్రి రోజాకు సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమని అన్నారు.