5 ట్రిలియన్‌ సాధన అతి కష్టం

5 ట్రిలియన్‌ సాధన అతి కష్టం

న్యూ ఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న తీరుపై ఆర్థిక వేత్త, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ సీ రంగరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడంలో సరైన నిర్ణయాలు తీసుకోకుంటే తప్ప మరో ఆర్థిక ముప్పు తప్పదని హెచ్చరించారు. ఇక్ఫాయ్లో జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కరోనా సంక్షోభం తలెత్తడానికి ముందు వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగానే ఉంది. 2019లో 2.3 ట్రిలియన్ డాలర్లతో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేంది. అప్పుడు ఆర్థిక వృద్ధి రేటు 9 శాతంతో కొనసాగింది. అదే స్పీడు మరో ఐదేళ్లు కొనసాగి ఉంటే 2025 నాటికి ఇండియా ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుని ఉండేది. భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుని ఉంటే దేశంలో నెలకొన్ని ఎన్నో సామాజిక రుగ్మతలకు పరిష్కారం లభించేంది. అట్టడుగు వర్గాలకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేవి. కరోనా వల్ల అనుకున్న లక్ష్యాన్ని ఇప్పుడు సాధించడం కష్టమే. కరోనా మొదటి వేవ్ ప్రజల ఆరోగ్యం మీద కంటే దేశ ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బ తీసింది. సెకండ్ వేవ్ ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపింది. మొత్తంగా కరోనా వల్ల రోజువారి కూలీల జీవితం దుర్భరంగా మారింది. ప్రస్తుతం వారికి ఉపాధి దొరకడం, జీవించడం కష్టంగా మారిపోయాయి. మన ఆర్థిక సమస్యలు తీరాలంటే ఇప్పుడున్న వృద్ధి రేటు సరిపోదు. కచ్చితంగా పెంచాల్సిందే. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. దాన్ని కాచుకుంటూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. అది జరగాలంటే ఓ వైపు టీకా కరణ వేగవంతం చేయాలి. దీనికి సమాంతరంగా వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగు కావాలి. అక్కడ పెట్టుబడులు పెరగాల’ని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos