హొసూరు : దేశ వ్యాప్తంగా కల్లోలానికి దారి తీస్తున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూఉ వివిధ రాజకీయ పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నాయి. డీఎంకే పిలుపు మేరకు మంగళవారం
తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనను నిర్వహించారు. జిల్లా కేంద్రమైన క్రిష్ణగిరితో పాటు హొసూరులో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. డీఎంకే జిల్లా అధ్యక్షుడు, తళి శాసనసభ్యుడు ప్రకాష్ అధ్యక్షతన హొసూరు రామనగర్ వద్ద పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ముస్లింలకు. శ్రీలంక శరణార్థులకు అన్యాయం చేస్తున్నారని నినాదాలు చేశారు. ఈ చట్టం వల్ల దేశంలో మత కలహాలు చెలరేగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే సామాన్యులు నష్టపోతారని హెచ్చరించారు. కనుక కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని సత్వరమే ఉపసంహరించుకోవాలని డీఎంకే నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో డీఎంకే జిల్లా అధ్యక్షుడు వై. ప్రకాశ్, హొసూరు ఎమ్మెల్యే సత్య, వేపనపల్లి ఎమ్మెల్యే మురుగన్, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.