లఖ్నవూ: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) రాజకీయ పక్షాన్ని నిషేధించినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఇక్కడ ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో చోటుచేసుకున్న ఆస్తుల ధ్వంసం, దహనాలు, అరాచకత్వం వెనుక పీఎఫ్ఐ హస్తం ఉంది. అలాంటి సంస్థలను ఉంచడం మంచిది కాదు. వాటిని నిషేధిస్తాం. ఎలాంటి దేశ వ్యతిరేక చర్యలను అనుమతించం. సిమి వంటి సంస్థలు ఏ రూపంలో వచ్చినా ఉక్కుపాదంతో అణిచి వేస్తాం. స్టుడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమి), పీఎఫ్ఐలు మారు వేషంలో వచ్చి ఆందోళనలు జరుపుతున్నాయి. వీటిపై విచారణ చేపట్టాం. త్వరలోనే నిజానిజాలు బయటపడతాయ’న్నారు.