అనామక లింక్‌ను క్లిక్ చేసినందుకు….

  • In Crime
  • November 14, 2019
  • 175 Views
అనామక లింక్‌ను క్లిక్ చేసినందుకు….

లక్నో : ఆన్‌లైన్‌లో పుడ్ ఆర్డర్ చేసిన ఓ యువకుడు రూ.4 లక్షలు పోగొట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. పుడ్ క్వాలిటీ సరిగా లేదని ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసుకునే క్రమంలో రూ.4 లక్షలు పోగొట్టుకున్నాడో బాధితుడు. లక్నోలోని గొమ్తినగర్ కు చెందిన ఓ యువకుడు బుధవారం ఓ ప్రముఖ పుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆర్డర్ చేశాడు. అనంతరం క్వాలిటీ సరిగా లేదనుకొని ఆర్డర్‌ను క్యాన్సిల్ చేశాడు. ఈ క్రమంలో తను చెల్లించిన డబ్బులను తిరిగి పొందడం కోసం ఆన్‌లైన్‌లో కస్టమర్ కేర్ నంబరును వెతికి కాల్ చేశాడు. ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత సమస్య గురించి ఆడిగాడు. డబ్బులు చెల్లించాలంటే తాము పంపిన లింక్‌ను క్లిక్ చేసి మరో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు. దానికి సమ్మతించిన యువకుడు ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని దాంట్లో బ్యాంక్ అకౌంట్ వివరాలను పొందుపరిచాడు. ఈ క్రమంలో ఓ ఓటీపీ రాగా, అది ఎంటర్ చేస్తే డబ్బులు రిఫండ్ అవుతాయని నమ్మించాడు. దీంతో ఆ యువకుడు ఓటీపీని ఎంటర్ చేశాడు. వెంటనే అతని అకౌంట్లో ఉన్న రూ.4 లక్షలు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. కంగుతిన్న యువకుడు మళ్లీ ఆ నంబరుకు కాల్ చేయగా, ఎటువంటి స్పందన రాలేదు. మోసపోయానని తెలుసుకున్న యువకుడు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos