హొసూరు : స్థానిక సంస్థల్లో ఇటీవల విజేతలుగా నిలిచిన అభ్యర్థులు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు గత నెల 27, 30 తేదీల్లో రెండు విడతలుగా జరిగిన సంగతి తెలిసిందే. కృష్ణగిరి జిల్లాలోని పది యూనియన్ల లో రెండు విడతలుగా ఎన్నికలు
నిర్వహించిన అనంతరం జనవరి రెండవ తేదీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. హొసూరు యూనియన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీ యూనియన్ కౌన్సిలర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పంచాయతీ అధ్యక్షులుగా గెలుపొందిన
వారు ఆయా పంచాయతీ కార్యాలయాల్లో పదవీ బాధ్యతలు చేపట్టారు. హొసూరు సమీపంలోని జనసంద్రం పంచాయతీ అధ్యక్షుడుగా గెలుపొందిన జైకుమార్ రెడ్డి పంచాయతీ కార్యాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు.
అదేవిధంగా కెలవరపల్లి పంచాయతీ అధ్యక్షుడుగా పుట్టారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు పంచాయతీ అధ్యక్షుడుగా మల్లేశ్వర్ రెడ్డి, అచ్చెట్టిపల్లి పంచాయతీ అధ్యక్షుడుగా శ్రీనివాస రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. బైరమంగలం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధ్యక్షురాలుగా మంజులా శ్రీనివాసరెడ్డి అధికార బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కొత్త సర్పంచులకు గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ఆయా పంచాయతీల ప్రజలు పాల్గొన్నారు.