అమరావతి:తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు బెదిరింపుల వల్లే సినీ నటులు వైకాపాలో చేరుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల్లో నిజం లేదని తెదేపా లోక్సభ సభ్యుడు, సినీ నటుడు మురళి మోహన్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.‘ సినిమా వాళ్లని కేసీఆర్ భయపెడుతున్నారని చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజం లేదు. ఒకరు భయపెడితే సినిమా వాళ్లు భయపడరు’ అని తేల్చి చెప్పారు. తనకు బదులుగా కోడలు రూప లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయం గురించి ఆలోచిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రూప పోటీ చేస్తే ఆమె తరపున పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తానని చెప్పారు. కేసీఆర్ విషయంలో చంద్రబాబు వ్యాఖ్యల్ని మురళీ మోహన్ ఖండించటం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని మురళి మోహన్ స్వయంగా చంద్రబాబుకి స్వయంగా వివరించారు. దీంతో వేరే అభ్యర్థి గాలింపుజరుగుతోంది. తన కోడలు రూప కూడా పోటీ చేయదని గతంలో మురళీ మోహన్ చెప్పారు. అయితే బుధవారం ఈ విషయమై పునరాలోచనలో పడినట్లు పేర్కొనటం గమనార్హం.