ముంబై: కేంద్రం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక మందగమన సమస్యలకు పరిష్కారాల్ని వెదకటానికి బదులుగా విపక్షాల పై నిందారోపణలు చేయడా నికే ప్రయత్నిస్తోందని ,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం ఇక్కడ విమర్శించారు. ఇలాంటి వైఖరి వల్ల ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి సరైన పరిష్కారాలు కనుగొనలేమని వ్యాఖ్యానించారు. ‘కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను చూసా. ఆమె వ్యాఖ్యలపై స్పందించడం నాకు ఇష్టం లేలు. ఆర్థిక వ్యవస్థలో లోటు పాట్లను సరిచేయడానికి ముందు అసలు సమస్యకు మూలాలేంటో, దానికి పరిష్కారాలు ఏమున్నాయో చూడాల’ని సలహా ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ల హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయంటూ నిర్మలా సీతారామన్ ఆరోపించటం తెలిసిందే. ‘రాజన్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నపుడు చాలా మంది నాయకులు ఫోన్లు చేస్తేనే రుణాలు పుట్టాయి. ఇప్పుడు ఆ మొండి బకాయిల నుంచి బయటపడటానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోంద’ని ఆమె వ్యాఖ్యానిం చా రు. గురువారం ముంబయికి వెళ్లిన మన్మోహన్ సింగ్ను పంజాబ్ మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ) మదుపర్ల బృందం కలిసి తమ సమస్యపై స్పందించాలనీ.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన్ను కోరారు.‘ పీఎంసీ బ్యాంకు విషయంలో జరిగిన పరిణామాలు చాలా దురదృష్టకరం. దాదాపు 16లక్షల మంది ఖాతాదారులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించాల’ని ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, మహా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్కు ఆయన విజ్ఞప్తి చేశారు.