తలసాని తనయుడు మనోళ్లను మించిపోయాడు….

తలసాని తనయుడు మనోళ్లను మించిపోయాడు….

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు,వారసులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే చరిత్ర,భౌగోళిక అంశాల గురించి కనీస అవగాహన కూడా లేదేమో అనే అనుమానం కలుగుతోంది.గతంలో తెదేపా నేత జలీల్‌ఖాన్‌ బీకాంలో ఫిజిక్స్‌ చదివానంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.జలీల్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలతో నెటిజన్లు జలీల్‌ఖాన్‌పై ఏస్థాయిలో ఆడుకున్నారో తెలిసిందే.జలీల్‌ఖాన్‌కు తామేమి తక్కువ కాదంటూ కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తమ పాండిత్యాన్ని బయటపెట్టుకున్నారు.అమెరికాను కనిపెట్టింది వాస్కోడమా అని ఒక ఎమ్మెల్యే అంటే వాస్కోడమా కాదు వాస్కోడిగామా అంటూ పక్కనున్న వైసీపీ ఎమ్మెల్యేలు సైతం తమ పాండిత్యాన్ని బయటపెట్టుకొని అభాసుపాలయ్యారు.మరో ఎమ్మెల్యే అయితే స్వామివివేకానందను ఏకంగా వివేకానందరెడ్డి చేసి నవ్వులపాలయ్యారు.తాజాగా తెలంగాణలో కూడా ఇటువంటి ఓ పండితుడు బయటకు వచ్చాడు.తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తనయుడు సాయికిరణ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.రెండు తెలుగు రాష్ట్రాలకు తాగుసాగు నీటికి ప్రధాన నది,దేశంలోనే అతిపెద్ద జీవనదుల్లో ఒకటైన గోదావరి నది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ప్రవహిస్తూ తెలంగాణలో ప్రవేశించి బంగాళఖాతంలో కలుస్తుందంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.సాయికిరణ్‌ చేసిన వ్యాఖ్యలు చూసిన నెటిజన్లు,ప్రజలు రాజకీయాల్లో రావాలని ఉబలాటపడే రాజకీయ నేతల వారసులు ముందు రాష్ట్రాల చరిత్ర,భౌగోళిక అంశాలు,నదులు,ఆర్థిక పరిస్థితుల గురించి పరిజ్ఞానం పెంచుకోవాలంటూ చురకలు అంటించారు.మరో ఆసక్తికర విషయం ఏంటంటే గతంలో జలీల్‌ఖాన్‌ను ఇంటర్‌వ్యూ చేసిన యాంకరే సాయికిరణ్‌ను కూడా ఇంటర్‌ వ్యూ చేశారు.అప్పుడు జలీల్‌ఖాన్‌ దొరికిపోయినట్లే తాజాగా సాయికిరణ్‌ కూడా అదే యాంకర్‌కు అడ్డంగా దొరికిపోయారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos