లోక్​సభ బరిలో 15మంది మాజీ సీఎంలు- ఎన్​డీఏ నుంచే 12మంది

లోక్​సభ బరిలో 15మంది మాజీ సీఎంలు- ఎన్​డీఏ నుంచే 12మంది

న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల తరఫున 15మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12మంది ఎన్డీఏ నుంచి బరిలో దిగుతుండగా, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. ఇందులో 6,122 రోజులపాటు మధ్యప్రదేశ్ సీఎంగా పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గరి నుంచి ఒక్క రోజు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన జగదాంబికా పాల్ వరకు ఉన్నారు. వీరిలో శివరాజ్ సింగ్ చౌహాన్, సర్బానంద సోనోవాల్ మధ్యప్రదేశ్, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హోదాలో బీజేపీని గెలిపించడానికి, తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి పదవులను త్యాగం చేశారు. త్రిపుర సీఎంగా బిప్లవ్ దేవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ స్థానిక వ్యతిరేకత, స్వపక్షంలో అసమ్మతి కారణంగా పదవులను వదులుకుని సొంత రాష్ట్ర రాజకీయాల నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా అర్జున్ ముండా, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజ్నాథ్సింగ్ సభలో మెజారిటీని నిరూపించుకోలేకపోయారు. దీనివల్ల వారి అనంతరం ఆ రెండు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రులుగా పని చేసిన జగదీష్ శెట్టర్, బసవరాజ్ బొమ్మైలు తమ హయాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించలేక పదవులను వదులుకోవాల్సి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్పార్టీతోపాటు, సీఎం పదవి కూడా రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసుకొని బయటికెళ్లిపోయారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలు కావడం వల్ల ఆయన 2018లో తిరిగి సొంత గూడు కాంగ్రెస్కు తిరిగి వచ్చారు. అనంతరం 2023 ఏప్రిల్లో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రులుగా పని చేసిన దిగ్విజయ్ సింగ్, భూపేశ్ బఘేల్లది కూడా అదే పరిస్థితి. అరుణాచల్ప్రదేశ్ సీఎంగా పనిచేసిన నబంతుకి కూడా మెజారిటీ నిరూపించుకోలేకపోయారు. ప్రభుత్వం కూలిపోవడం వల్ల అక్కడ రాష్ట్రపతి పాలన వచ్చింది. రెండోసారి 2016 జులై 13 నుంచి 16 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెమా ఖండూ నేతృత్వంలో 43 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీకి అనుబంధంగా ఉన్న పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్గా మారడం వల్ల నబంతుకి పదవి కోల్పోవాల్సి వచ్చింది. హిమాచల్లో పెమాఖండు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రస్తుతం సర్బానంద సోనోవాల్, బిప్లబ్ కుమార్ దేవ్, దిగ్విజయ్సింగ్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అయినా వారి పార్టీ అధిష్ఠానాలు, స్థానిక అవసరాల రీత్యా లోక్సభ ఎన్నికల బరిలోకి దింపాయి. రాజ్నాథ్ సింగ్, జగదాంబికా పాల్, అర్జున్ ముండా ప్రస్తుతం లోక్సభ సభ్యులుగా ఉంటూ మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మిగిలినవారంతా కొత్తగా ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ కుమారుడైన హెచ్డీ కుమారస్వామి ఒకసారి బీజేపీ, ఒకసారి కాంగ్రెస్ మద్దతుతో కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ గ్రాఫ్ పడిపోడింది. దీంతో రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీ గత ఏడాది సెప్టెంబరులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరింది. ప్రస్తుతం పొత్తుల్లో భాగంగా మూడు జేడీఎస్కు మూడు సీట్లు దక్కాయి. అందులో కుమారస్వామి మాండ్య నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. దీనివల్ల సిట్టింగ్ ఎంపీ, సీనియర్ సినీ నటి సుమలత అక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం కోల్పోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos