హోసూరు : కృష్ణగిరి జిల్లాలోని వేపనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఎడిఎంకె రాజ్యసభ సభ్యుడు కెపి. మునుస్వామి సన్నాహాలు చేసుకుంటున్నట్లు వినవస్తోంది. వేపనపల్లి నియోజకవర్గంలో డిఎంకె,ఎడిఎంకె పార్టీలు బలంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో వన్నియర్లు, ఎస్సి, వాల్మీకి, కాపు ఓటర్లు అధిక సంఖ్యలో వున్నారు. ప్రధానంగా వన్నియర్లు, ఎస్సి, వాల్మీకి ఓటర్లను నిర్ణయాత్మక శక్తిగా భావించవచ్చు. వేపనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అనేక మంది ఉవ్విళ్లూరుతున్నారు. ఎడిఎంకె అభ్యర్థిగా హేమనాథ్ బరిలోకి దిగుతారని తొలుత అనుకున్నా, తర్వాత వేరే అభ్యర్థి పోటీ చేస్తారని తెలిసింది. మాజీ ఎంపి అశోక్ కుమార్ పోటీ చేస్తారని వార్తలు వినిపించినా సీన్ మారింది. ప్రస్తుతం కెపి. మునుస్వామి పేరు వినిపిస్తుండడంతో హేమనాథ్ ఆశలు గల్లంతయ్యాయి. కెపిఎం తన మద్దతుదారులతో ఇప్పటికే మంతనాలు ప్రారంభించినట్లు తెలిసింది. ఒకవేళ కెపిఎం పోటీచేస్తే ఆయనను ఢీకొట్టేందుకు డిఎంకె పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థి ఎవరనేది ప్రస్తుతం సస్పెన్స్ గానే మిగిలివుంది. డిఎంకె పార్టీ తరుపున ప్రస్తుత ఎమ్మెల్యే మురుగన్ బరిలోకి దిగితే గెలుపొందే సత్తా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.