ముంబై : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మంగళ వారం మరోసారి ఉద్ధవ్ ఠాక్రే సర్కార్పై విరుచుకు పడ్డారు. హరియాణా యూట్యూబర్ సాహిల్ చౌదరి అరెస్ట్ వ్యవహారంలో ఆమె మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. ‘ముంబైలో గూండా రాజ్యం సాగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రపంచంలోనే అత్యంత అసమర్థుడు. ఆయన బృందాన్ని ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదా? అసలు వారు మనకేం చేశారు..? మన ఇళ్లను పగలకొట్టి మనల్ని చంపడమేనా..? దీనికి ఎవరు బదులిస్తారు? సర్కార్ను ప్రశ్నించడం సాహిల్ చౌదరి ప్రజా స్వామిక హక్కు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు సాహిల్పై ఎవరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే దాని ఆధారంగా ఆయనను తక్షణమే జైలుకు పంపారు. మరోవైపు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి పాయల్ ఘోష్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసినా ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నారు? ఇదేం చోద్యమ’ని ప్రశ్నించారు.