చెన్నై: రాజకీయ నాయకులను ప్రశ్నించడం ప్రజల హక్కు, ఆ హక్కులను ప్రజలు నెరవేరుస్తూ ఉంటేనే దేశానికి మేలు జరుగుతుందని మక్కల్ నీతి మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమలహాసన్ తెలిపారు. తిరుచ్చి లోక్సభ నియోజక వర్గంలో డీఎంకే కూటమిలో పోటీ చేస్తున్న ఎండీఎంకే అభ్యర్థి దురై వైగోకు మద్దతుగా కమల్ మంగళవారం శ్రీరంగంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ… నా తమ్ముడు దురై వైగో కోసం ఇక్కడికి వచ్చానని అన్నారు. ద్రావిడ మోడల్ నిన్న, నేడు వచ్చింది కాదన్నారు. ద్రావిడ మోడల్ త్వరలోనే దేశానికే మోడల్గా మారుతుందని అన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉదయం అల్పాహార పథకంగా మార్చారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులు కేంద్రప్రభుత్వం అందించడం లేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు అందిస్తున్న నిధులతో పోల్చితే రాష్ట్రానికి తక్కువగా అందుతోందని తెలిపారు. రాష్ట్రం నుంచి వసూలవుతున్న పన్ను వాటాలో రూపాయికి 29 పైసలు మాత్రమే కేంద్రం ఇస్తోందన్నారు. ఆ నిధులు పెంచితే రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశముందని కమల్ పేర్కొన్నారు.