న్యూఢిల్లీ : కొవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు ఇటీవల ఆ టీకా తయారు చేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. కోవిడ్19 టీకా తీసుకున్న వారికి ఇచ్చే కోవిన్ సర్టిఫికేట్లో ఉండే ప్రధాని మోదీ ఫోటోను ఆ సర్టిఫికేట్ నుంచి తొలగించారు. చాలా అరుదైన కేసుల్లో కొవిషీల్డ్ వల్ల .. రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉన్నట్లు ఆస్ట్రాజెనికా కంపెనీ ఇటీవల అంగీకరించింది. కానీ భారత్లో ఎన్నికల నియమావళిని దృష్టిలో పెట్టుకుని కోవిన్ సర్టిఫికేట్లో మోదీ ఫోటోను తొలగించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీఐ ఇచ్చిన ఆదేశాల మేరకు కోవిన్ సర్టిఫికేట్ నుంచి మోదీ ఫోటోను తొలగించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. బ్రిటన్కు చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ యూరోప్ దేశాల్లో వాక్స్జెవేరియా పేరుతో టీకాను సరఫరా చేస్తున్నది. ఆ టీకానే కొవిషీల్డ్ పేరుతో ఇండియాలో అందించారు. ఇండియాలో ఆ టీకాను సీరం సంస్థ తయారు చేసిన విషయం తెలిసిందే. కొవిషీల్డ్ వల్ల కొన్ని అరుదైన కేసుల్లో బ్లడ్ క్లాట్ జరిగే అవకాశాలు ఉన్నట్లు ఓ రిపోర్టు ద్వారా తేలింది.