కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మహిళల అదృశ్యమవుతున్న ఘటనలు సంచలనంగా మారింది.గత పది రోజుల్లో రాజధాని హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి పైగా మహిళలు,యువతులు అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయి.ప్రతీరోజూ మహిళలు,యువతులు అదృవ్యమవుతుండడం సాధారణ ప్రజలతో పాటు పోలీసులను సైతం విస్మయపరుస్తోంది.దీంతో అదృశ్యమైన మహిళల ఆచూకీ కనుగొనడానికి నడుం బిగించిన తెలంగాణ పోలీసులు అందుకోసం ఫేషియల్ రికగ్నైజేషన్ అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు.ఈ సాఫ్ట్వేర్ను పోలీసులు వినియోగించే స్మార్ట్మొబైళ్లను అనుసంధానం చేస్తారు.దీంతో హైదరాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో మాత్రమే కాకుండా నగర శివార్లలో,రహదారులపై విధులు నిర్వర్తించే పోలీసులు ఆయా ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగే మహిళల ఫోటోలను కెమెరాల బంధిస్తారు.అనంతరం ఫోటోలను తమ డేటాబేస్లో ఉన్న క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టంకు అనుసంధానం చేసి అందులోని ఫోటోలతో పోల్చి చూస్తారు.డేటాబేస్లో ఉన్న ఫోటోలతో 80శాతం పోలికలు సరిపోతే వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించి వేలిముద్రలు తీసుకుంటారు.తప్పిపోయిన మహిళలు,పిల్లలు ఉంటే వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్కు సమాచారం అందిస్తారు.దీంతో పాటు ఎక్కడో నేరాలు చేసి హైదరాబాదళ్ నగరంలో తలదాచుకున్న నిందితులను పట్టుకోవడానికి కూడా ఈ సాఫ్ట్వేర్ ఉపయోగకరంగా ఉంటుందని పోలీసులు తెలుపుతున్నారు.