ఢిల్లీ : తెలంగాణలో అటవీ శాఖ అధికారులపై ఆదివారం జరిగిన దాడి పట్ల కేంద్రం తీవ్రంగా స్పందించింది. రాజ్యసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ సంఘటనపై మాట్లాడారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని, దీనిని చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అసిఫాబాద్ జిల్లాలో హరిత హారం నిర్వహించడానికి వెళ్లిన అటవీ శాఖ అధికారులపై తెరాస ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణారావు అనుచరులతో కలసి దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడిలో అటవీ శాఖ రేంజ్ అధికారిణి అనిత తీవ్రంగా గాయపడ్డారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన తెలిపారు.