హొసూరు : పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి గత 10 నెలలుగా రూ.40 లక్షల వరకు జరిమానా వసూలు చేశారు. హొసూరు ప్రాంతంలో ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. అందులో భాగంగా వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు తప్పని సరిగా వాహనాలలో ఉంచాలని సూచనలు చేశారు. పోలీసులు ఎన్ని సూచనలు చేసినా వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడంతో ద్విచక్ర వాహనదార్లపై కేసులు నమోదు చేశారు. గత నెలలో హొసూరు పట్టణ ప్రాంతంలో ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణలకు సంబంధించి పోలీసులు 2600కు పైగా కేసులు నమోదు చేశారు. గత 10 నెలలుగా నిబంధనలు అతిక్రమించిన వాహనచోదకులపై కేసులు నమోదు చేసి రూ.40 లక్షల వరకు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. గత నెల రోజుల్లో డాక్యుమెంట్లు లేక నడుపుతున్న వందకు పైగా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు హొసూరు డిఎస్పీ మీనాక్షి తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.