టెస్టు వాయిదాపై ప్రకంపనలు

  • In Sports
  • September 11, 2021
  • 111 Views
టెస్టు వాయిదాపై ప్రకంపనలు

టీమిండియా- ఇంగ్లండ్ మధ్య శుక్రవారం జరగాల్సిన ఐదో టెస్టు నిరవధికంగా వాయిదా పడటంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇప్పటికే 2-1 తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్న కోహ్లి సేన.. ఇంగ్లండ్‌ను ఓడించి ట్రోఫీ గెలుస్తుందా లేదా సమం చేస్తుందా అనే చర్చ జోరుగా నడిచింది. అయితే, కోవిడ్ కారణంగా ఆరంభానికి ముందు ఆఖరి టెస్టు రద్దు కావడంతో అందరూ ఉసూరుమన్నారు. బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్న టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకడంతో.. ఆయన బాధ్యతారాహిత్యం వల్లే ఇలా జరిగిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఐదో టెస్టును నిరవధికంగా వాయిదా వేసిన క్రమంలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ప్రతిపాదనను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తిరస్కరించినట్లు  వార్త వెలుగులోకి వచ్చింది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ నేపథ్యంలో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారిన విషయం తెలిసిందే. అయితే, చివరి టెస్టుకు ముందు టీమిండియా సెకండ్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు పాజిటివ్‌గా తేలడంతో మ్యాచ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఆటగాళ్లందరికీ పరీక్షలు నెగటివ్ వచ్చినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఈసీబీ, ఆ తర్వాత నిరవధికంగా వాయిదా వేసినట్లు వెల్లడించింది. కాగా రెండు రోజుల తర్వాత మ్యాచును నిర్వహించాల్సిందిగా కోహ్లి ప్రతిపాదించినట్లు సమాచారం. హెడ్ కోచ్‌తో పాటు కీలక అడ్వైజర్లు అందుబాటులో లేకపోవడం, ఫిజియోథెరపిస్టు కూడా కరోనా బారిన పడటంతో రెండు లేదా మూడు రోజుల అనంతరం మ్యాచ్ ఆడించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఈసీబీ మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించి మ్యాచును నిరవధికంగా వాయిదా వేసేందుకే మొగ్గు చూపడం గమనార్హం.
మరోవైపు ఈ మ్యాచ్ రీషెడ్యూల్ గురించి చర్చించే క్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఈనెల 22న ఇంగ్లండ్ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ అర్ధంతరంగా ఆగిపోవడం, తద్వారా ఈసీబీకి జరిగిన నష్టం, తిరిగి ఎప్పుడు మ్యాచ్ నిర్వహించాలన్న అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos