ఇకపై హత్యాచార ఘటనలకు పాల్పడితే పోలీసుల ఎన్కౌంటర్లతోనే శిక్షలు విధిస్తామంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హత్యాచారం వంటి క్రూరమైన నేరాలకు విచారణ,బెయిల్,జైలు వంటి ప్రయోజనాలు ఇకపై ఉండవని నేరుగా ఎన్కౌంటర్ సౌకర్యం మాత్రమే ఉంటుందని హెచ్చరించారు.ఇటువంటి ఘటనలకు పాల్పడితే ఎటువంటి శిక్ష ఉంటుందో దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ ద్వారా సంకేతాలు ఇచ్చామని ఇకపై ఇదే కొనసాగుతుందని స్పష్టం చేశారు.కాగా దక్షిణ భారత్ గురించి జాతీయ మీడియా ఎన్నడూ పట్టించుకోదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు హైదరాబాద్ ఎన్కౌంటర్ ఘటనపై దృష్టి సారించారని తెలిపారు. దీనిపై ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారని అన్నారు.నిందితులకు తెలంగాణ పోలీసులు తగిన గుణపాఠం చెప్పారని ప్రజలు అంటున్నారని తలసాని వ్యాఖ్యానించారు. దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఓ సందేశం ఇచ్చిందని ఆయన అన్నారు. మరో మంత్రి పువ్వాడ అజయ్ సైతం దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు.