దిశ హత్యాచార ఘటనపై ఆగ్రహావేశాలు,స్పందనలు రోజురోజుకు పెరుగుతన్నాయి.నిందితులకు ఉరిశిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తుంటే సినీరంగ ప్రముఖులు సైతం ఘటనను ఖండిస్తూ తమదైన శైలిలో హితబోధలు,స్పందనలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలో దర్శకుడు సుకుమార్ సైతం తనదైన శైలిలో ఘటనపై స్పందించాడు. నేరస్తులు ఎక్కడి నుంచో రారని, మన మధ్యే తయారవుతారని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఘోరాలను చెప్పడానికి తాను సరిపోనని వ్యాఖ్యానించారు.”వెటర్నరీ వైద్యురాలు ఆ సమయంలో 100 నంబరుకు ఫోన్ చేయాల్సిందని చాలామంది చెబుతున్నారు. కానీ నలుగురు కుర్రాళ్లు హెల్ప్ చేస్తామని ముందుకు వస్తే తాను 100 నంబరుకు ఫోన్ చేయడం ఏం బాగుంటుందని ఆ అమ్మాయి భావించి ఉంటుంది. సాయం చేయడానికి వస్తే పోలీసులను పిలుస్తావా అక్కా అని వాళ్లు అడిగితే తాను ఏంచెప్పగలనని ఆమె అనుకుని ఉండొచ్చు. అమ్మాయిలు అబ్బాయిల్ని అంతగా నమ్ముతారు. కానీ తల్లీ, దయచేసి మమ్మల్ని నమ్మొద్దమ్మా! మేం మృగాళ్లం. సొంతవాళ్లను కూడా నమ్మొద్దు తల్లీ. ప్రతి ఒక్కరినీ అనుమానించండి… అనుమానం వస్తే ముందు 100 నంబరుకు ఫోన్ చేయండి. ఒకవేళ మనం పొరబడితే క్షమాపణ అడుగుదాం అంతే తప్ప ప్రమాదంలో చిక్కుకోవద్దు” అంటూ ఉద్వేగభరితంగా మాట్లాడారు.