‘అతడి పని అయిపోయింది.. అతడిని క్రికెట్ నుంచి తప్పించడం మంచిది’ అంటూ తన పట్ల వస్తున్న విమర్శలకు ఎప్పటికప్పుడు తన ఆటతీరుతో చెక్ పెడతాడు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ మహేంద్ర సింగ్ ధోనీ. కొంత కాలంగా అతడిపై ఇటువంటి విమర్శలే వస్తున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ధోనీ 51 పరుగులు (96 బంతుల్లో) చేసినప్పటికీ అతడిపై విమర్శలు ఆగలేదు. ఎప్పుడో ఒకసారి బాగా ఆడడం కాదు.. టీమిండియాను గెలిపించేలా ఆడాలి అంటూ విమర్శలు వచ్చాయి. అయితే, మంగళవారం ఆసీస్తో జరిగిన రెండో వన్డేలోనూ దీటుగా ఆడిన ఝార్ఖండ్ డైనమైట్.. తనను విమర్శిస్తున్న వారు సైతం ప్రశంసించేలా చేసుకున్నాడు. ఇప్పుడు ‘ధోనీ లేకపోతే గెలిచేవాళ్లమా..?’ అని భారత క్రికెట్ అభిమానులు అంటున్నారు. రెండో వన్డే చివరి ఓవర్లో సిక్స్ కొట్టి అర్ధశతకాన్ని పూర్తి చేయడమే కాకుండా టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. 54 బంతుల్లో 55 పరుగులు (నాటౌట్) చేసి భారత్ను గెలిపించాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 299 పరుగలు లక్ష్యాన్ని ఛేదించడంలో కీలకంగా వ్యవహరించాడు.