హొసూరు : తళి నియోజకవర్గం అభివృద్ధికి తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలను తీసుకొచ్చానని మాజీ మంత్రి బాలకృష్ణా రెడ్డి తెలిపారు. అన్నాదురై 111వ జయంతిని పురస్కరించుకుని కెలమంగలంలో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అప్పట్లో తాను మంజూరుకు చేయించుకుని వచ్చిన పథకాలకు ఇప్పుడు డీఎంకే ఎమ్మెల్యే భూమి పూజ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధిపథకాలను చేపట్టామని, సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని వివరించారు. విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు, సైకిళ్లు, యూనిఫామ లాంటి సంక్షేమ పథకాల గురించి ఆయన గుర్తు చేశారు. అన్నా డీఎంకే కెలమంగలం సమితి కార్యదర్శి కృష్ణన్ అధ్యక్షతన జరిగిన సభలో ఎంజీఆర్ యువజన సంఘం రాష్ట్ర ఉప కార్యదర్శి డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడారు. కృష్ణగిరి జిల్లాలోనే అత్యంత వెనుకబడిన డెంకణీకోట తాలూకాలో అన్నా డీఎంకే హయాంలోనే అభివృద్ధి పనులు జరిగాయని ఆయన తెలిపారు. సభలో డెంకణీకోట అన్నా డీఎంకే నాయకులు సయ్యద్ హుసేన్, నాగేష్, సంపంగి రామరెడ్డి, కేసీఎంఎస్ అధ్యక్షుడు హరీశ్ రెడ్డి, అగ్గొండపల్లి సహకార సంఘం అధ్యక్షుడు ఎస్. మునిరెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వచ్చారు.