ఢిల్లీ : నిర్భయ సామూహిక హత్యాచారం కేసులో ఉరి శిక్షకు గురైన నలుగురు దోషుల మృతదేహాలను వారి కుటుంబాలకు అందజేసినట్లు జైలు అధికారులు తెలిపారు. ముకేశ్ సింగ్ (32), పవన్ గుప్త (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)లను తిహాడ్జైలులో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరి తీశారు. తలారి పవన్ జల్లాద్ నలుగురు దోషుల్ని నిబంధనల ప్రకారం ఉరితీశారు. 30 నిమిషాల పాటు వారి మృతదేహాల్ని అలాగే వేలాడదీశారు. వైద్యుడు మృతదేహాలను పరిశీలించి నలుగురూ చనిపోయినట్లు ప్రకటించిన తర్వాత దీనదయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు తిహాడ్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ తెలిపారు.