పర్చూరు: మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేశ్ వైకాపాలో చేరనుండటంపై ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దగ్గుబాటి రాకను నిరసిస్తూ ఆయన సొంత నియోజకవర్గం ప్రకాశం జిల్లా పర్చూరు రోటరీ భవన్లో వైకాపా నేతలు సమావేశమయ్యారు. అధికారం ఎక్కడ ఉంటే దగ్గుబాటి అక్కడ ఉంటారని.. పార్టీలో పనిచేస్తున్నవారికి అన్యాయం చేయొద్దని నేతలు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. దగ్గుబాటి కుటుంబానికి టికెట్ ఇచ్చే సంప్రదాయం మంచిదికాదని వారంతా అభిప్రాయం వ్యక్తం చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్ను దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అతని కుమారుడు హితేశ్ ఆదివారం కలిశారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని ఆయన నివాసంలో జగన్తో భేటీ అయ్యారు. అనంతరం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తామిద్దరం వైకాపాలో చేరనున్నామని, తన సతీమణి పురందేశ్వరి మాత్రం భాజపాలోనే కొనసాగుతారని చెప్పారు.