ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితం నుంచి కాస్త విరామం కోరుకునే నగరజీవులు వారాంతాల్లో ఏగోల ఉండని అడవుల్లో పక్షుల కిలకిలలు, సెలయేళ్ల సవ్వడుల మధ్య గడపడానికి ఆసక్తి కనబరుస్తుంటారు.అటువంటి వాళ్ల కోసం దక్షిణ కర్ణాటక అడవుల్లోని కావేరి ఫిషింగ్ క్యాంప్ నేనున్నాంటూ సాదరంగా ఆహ్వానిస్తోంది.మండ్య జిల్లాలోని హాగలూరుకు కేవలం 23 కిలోమీటర్ల దూరంలోని అటవీప్రాంతంలో ప్రవహించే కావేరి నది వెంట ఉన్న కావేరి ఫిషింగ్ క్యాంప్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.ఆటవిడుపు – సాహసం, సరదా, ప్రశాంతత అన్నే సమపాళ్ళలో ఇది పర్యాటకులకు అందిస్తుంది.పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుండడాన్ని గుర్తించిన కర్ణాటక అటవీశాఖ,పర్యాటకశాఖ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా భీమేశ్వరి, గలిబోరే, దొడ్డమాకలి మూడు శిబిరాలను ఏర్పాటు చేశారు.అందులో భీమేశ్వరి, గలిబోరే శిబిరాలు పర్యాటకులను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయగా దొడ్డమకలి ఫిషింగ్ క్యాంప్ కేవలం కార్పోరేట్ విహార కేంద్రంగా తీర్చిదిద్దారు.ఇక్కడి శిబిరాలు సాధారణ శిబిరాల్లా కాకుండా పూర్వీకులు నివసించినట్లు ఉండే విధంగా దుంగలతో తయారు చేశారు.మరికొన్ని శిబిరాలను గుడారాలతో తయారు చేశారు.ఈ శిబిరాల్లో విద్యుత్ దీపాలకు బదులు హరికేన్ దీపాలు లేదా సౌర దీపాల వెలుగు మధ్య గడపడం ప్రత్యేక అనుభూతి.ఇక్కడ ప్రధాన ఆటవిడుపు చేపలు పట్టడమే(ఫిషింగ్)అయినా చేపల సంఖ్య తగ్గుముఖం పట్టడం వల్ల ఇక్కడ సందర్శకులు చేపలు పట్టి, వెంటనే వేస్తుంటారు.ఇక ఇక్కడ ట్రెక్కింగ్, కయకింగ్, కొరకిల్ సవారీ, పర్వత బైకింగ్ ప్రత్యేకతలు.దీని చుట్టూ 95 జాతుల పక్షులు, మొసళ్ళు, తాబేళ్లు కూడా చూసి ఆనందించవచ్చు.బెంగళూరు నగరం నుంచి రోడ్డు,రైలు మార్గం ద్వారా మండ్య పట్టణానికి చేరుకొని అక్కడి నుంచి వాహనాల్లో శిబిరాలకు చేరుకోవచ్చు..