మూడు దశాబ్దాల క్రితం బుల్లితెరపై అద్భుతాలు సృష్టించిన దూరదర్శన్ లో ప్రసారమైన రామాయణ్ ధారావాహిక తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. హిందీ అర్థం కాకపోయినా… ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ… సీరియల్ టైమ్ కి టీవీల ముందు వాలిపోయేవారు. ఆ తర్వాత ఎన్నో చానల్స్ వచ్చి… ఎన్నో సీరియల్స్ ప్రసారమై, ప్రేక్షకాదరణ పొందాయి. కానీ, ఆనాటి రామాయణ్ మాత్రం ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. మళ్లీ ఆ సీరియల్ ప్రసారమైతే బాగుండునని మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనిపించే ఉంటుంది. ఇప్పుడు ఆ కోరిక తీరబోతోంది. అవును. అలనాటి రామాయణ్ సీరియల్ ప్రేక్షకుల డిమాండ్ మేరకు మళ్లీ ప్రసారం కాబోతోంది.రేపు (శనివారం) రామాయణ్ తొలి ఎపిసోడ్ దూరదర్శన్ లో ప్రసారం కాబోతుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు… తిరిగి రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు సీరియల్ ప్రసారం అవుతుంది. ఈ వివరాలను కేంద్ర ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ వెల్లడించారు.రామాయణ్ సీరియల్ ను రామానంద సాగర్ నిర్మించారు. ఈ సీరియల్ లో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చికిలియా, లక్ష్మణుడిగా సునిల్ లాహ్రి నటించారు.