అమరావతి : తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఇక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడం లాంటి అంశాలపై చర్చించారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో క్షేత్ర స్థాయి నుంచి పార్టీ ప్రక్షాళనపై చర్చించినట్లు తెలిసింది. కొత్త నాయకత్వాన్ని ఎలా అభివృద్ది చేసుకోవాలనే విషయమై కూడా బాబు సీనియర్ల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఈ నెల 7 నుంచి విదేశ పర్యటనలకు వెళుతున్న ఆయన, ఈలోగా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఇతర అంశాలపై నాయకులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ నాయకులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, చినరాజప్ప, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని హాజరయ్యారు.