న్యూఢిల్లీ : 2019 డిసెంబరులో కాశ్మీర్ లోయలో ఓ టన్నెల్ నిర్మాణానికి లక్నోకు చెందిన ఆఫ్కో ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్ట్ పొందింది. ఈ కంపెనీ గండర్బాల్ జిల్లాలో 6.4 కిలోమీటర్ల పొడవైన జడ్-మార్హ్ టన్నెల్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీని నిర్మాణ వ్యయం రూ.2,716 కోట్లు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ సోనామార్గ్ హిల్ స్టేషన్కు ఈ టన్నెల్ ద్వారా చేరుకోవచ్చు. శ్రీనగర్-లెV్ా జాతీయ రహదారిపై ఉండడంతో ఇది దేశ భద్రత దృష్ట్యా కూడా వ్యూహాత్మకమైన ప్రాజెక్టే. ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ దక్కించుకొని నెల రోజులైనా కాకముందే ఈ కంపెనీ 2020 జనవరి 15న ఒక్కోటీ కోటి రూపాయల విలువైన పది ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ఆరు రోజుల తర్వాత ఆ బాండ్లను బీజేపీ నగదుగా మార్చేసుకుంది. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర పాలన కిందికి వచ్చిన విషయం తెలిసిందే.ఆఫ్కో ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం 2020లోనే బాండ్లను కొనుగోలు చేయలేదు. 2022లో కూడా రూ.10 కోట్ల విలువైన బాండ్లను కొన్నది. 2023లోనూ అంతే మొత్తంలో బాండ్లను కొనుగోలు చేసింది. అంటే మొత్తంమీద రూ.30 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసి, బీజేపీకి అందజేసిందన్న మాట. ఎన్నికల కమిషన్ గురువారం బయటపెట్టిన వివరాల్లో ఈ సమాచారం ఉంది. ఆఫ్కో నిర్మాణ సంస్థ చేతిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తర భారతదేశంతో పాటు పొరుగున ఉన్న నేపాల్లోనూ అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. 2022 జనవరిలో ఈ కంపెనీ రూ.10 కోట్ల విలువైన బాండ్లను బీజేపీకి అందజేసింది. ఏడు నెలల తర్వాత నేషనల్ హైవే అథారిటీ నుండి ఓ కాంట్రాక్ట్ పొందింది.