13 కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు

13 కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రెండు లేదా మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉగాదిలోపు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసి.. కొత్త జిల్లాలను అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోన్నట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతీ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందే వైసీపీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. అయితే కరోనా కారణంగా 2021 జనాభా లెక్కల సేకరణ వాయిదా పడింది. దీనితో కొత్త జిల్లాల ఏర్పాటుపై జాప్యం ఏర్పడింది.
ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు తోడుగా ప్రభుత్వం కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయనుంది. భౌగోళికంగా బాగా విస్తరించి ఉండటంతో అరకును రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, బాపట్ల, నంద్యాల, హిందూపురం, రాజంపేట…కొత్త జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయని సమాచారం.
కొత్త జిల్లాల ఏర్పాటుపై రెవిన్యూ శాఖ తొలుత ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఆ తర్వాత దానిపై సూచనలు, సలహాల కోసం 30 రోజులు గడువు ఇవ్వనుండగా.. వాటినన్నింటినీ పరిశీలించిన తర్వాత మార్పులు చేర్పులు చేసి తుది నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. తుది నోటిఫికేషన్‌లోనే కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చేదీ ప్రభుత్వం తెలియజేస్తుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos