ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యకర్తలతో సమావేశమైన వేళ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సమావేశం మధ్యలో శబరిమలలో మహిళల ప్రవేశం గురించిన ప్రస్తావన వచ్చిన వేళ ఒక్కో మతానికి ఒక్కో ధర్మం ఉంటుందని దాన్ని అందరూ పాటించాల్సిందేనని అన్నారు. శబరిమల గురించి తన భార్య అన్నా లెజినోవో తనను అడిగిందని గుర్తు చేసుకున్నారు. శబరిమలకు తానెందుకు వెళ్లరాదని ఆమె ప్రశ్నించిందని చెబుతూ, ఆ సమయంలో “నువ్వు చర్చికి వెళ్లినప్పుడు తలపై చీర కొంగును ఎందుకు కప్పుకున్నావు?” అని అడిగానని అందుకు ఆమె అది తమ సంప్రదాయమని చెప్పిందని అన్నారు.అదే విధంగా ఒక్కో ధర్మానికి ఒక్కో ఆచారం ఉంటుందని తాను చెప్పానని, అయ్యప్పస్వామి బ్రహ్మచారని, అనునిత్యమూ తపస్సులో ఉంటారు కాబట్టే, మహిళలను ఆయన చూడరని, అందువల్లే మహిళలకు అక్కడ ప్రవేశం లేదని వివరించానని పవన్ తన కార్యకర్తలకు తెలిపారు. రెచ్చగొట్టాలని చూస్తున్న కొందరు మాత్రమే శబరిమలపై కోర్టును ఆశ్రయించారని, ఆలయ వివాదంపై తన తల్లి కూడా బాధపడిందని అన్నారు.అంతకుముందు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నా.పవన్ వెంట పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు స్థానిక నేతలు కూడా ఉన్నారు. పవన్కు స్వాగతం పలికిన ప్రొటోకాల్ అధికారులు, వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందించారు. పవన్ ను చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తాను 30 సంవత్సరాల క్రితం తిరుపతిలో ‘ధర్మో రక్షతి రక్షితః‘ అని నేర్చుకున్నానని, ఇప్పటికీ దాన్నే పాటిస్తున్నానని అన్నారు.