అధికారిక అభ్యర్థిని కాను

అధికారిక అభ్యర్థిని కాను

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ‘అధికారిక అభ్యర్థి’ అనేది మీడియా సృష్టేనని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే చెప్పారు. తాను క్షేత్ర స్థాయి కార్యకర్తనని, ప్రతినిధులు తనను ఎంపిక చేశారని, పోటీ చేయాలని నాయకులు కోరారని ఒక మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీ అధిష్ఠానం, గాంధీలు సూచించిన అనధికారిక అధికారిక అభ్యర్థి మీరేనా? అని అడిగినపుడు ఖర్గే ఇలా స్పందించారు. ‘‘అందరు సీనియర్ నేతలు, పీసీసీ అధ్యక్షులు, నన్ను ప్రతిపాదించినవారు, ఇతర డెలిగేట్లు నాకు ఫోన్ చేశారు. గాంధీ కుటుంబం బరిలో లేకపోతే, ఈ ఎన్నికల్లో మీరు పోటీ చేయండి అని నన్ను అడిగారు. చాలా మంది సీనియర్ నేతలు, డెలిగేట్ల కోరిక మేరకు, నేను పోటీ చేస్తున్నాను’’ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అధికారాన్ని వికేంద్రీకరిస్తానని శశి థరూర్ చెప్తున్న విషయాన్ని ప్రస్తావించినపుడు … ఆయనతో తనను పోల్చవద్దని చెప్పారు. తాను బ్లాక్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి వచ్చానని, ఆ సమయంలో శశి థరూర్ ఉన్నారా? అని అడిగారు. శశి థరూర్ తన సొంత ప్రణాళికతో ముందుకు వెళ్ళవచ్చునని చెప్పారు. అయితే తన ఎజెండా మాత్రం ఉదయ్పూర్ లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమేనని చెప్పారు. అందరు సీనియర్ నేతలు, నిపుణులతో సంప్రదించిన తర్వాత ఈ డిక్లరేషన్ను రూపొందించినట్లు తెలిపారు. ‘నేను ఆర్గనైజేషనల్ మ్యాన్ ని . పార్టీ ఎవరు ఏమిటో నాకు తెలుసు. యువత సేవలను ఎక్కడ అవసరమైతే అక్కడ తీసుకుంటామ’ ని మరో ప్రశ్నకు బదులుగా చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న శశి థరూర్ పార్టీని పునరుజ్జీవింపజేయడం, మళ్లీ బలోపేతం చేయడం, కార్యకర్తలను సాధికారులను చేయడం, అధికారాన్ని వికేంద్రీకరించడం, ప్రజలతో మమేకమవడం వంటి 10 అంశాలను ప్రస్తావించారు. వీటిని అమలు చేస్తే రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, బీజేపీని ఎదుర్కొనడానికి రాజకీయంగా దీటుగా ఎదగవచ్చునని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 17న జరుగుతాయి. దాదాపు 9,000 మంది కాంగ్రెస్ డెలిగేట్లు ఓటు వేసేందుకు అర్హులు. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos