పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి షోయబ్ మాలిక్ కెరీర్ దాదాపుగా ముగిసినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి.కొద్ది కాలంగా పలు సిరీస్ లకు షోయబ్ ను పక్కన పెడుతున్న పాక్ క్రికెట్ బోర్డు తాజాగా న్యూజిలాండ్ పర్యటనకు కూడా షోయబ్ ను పక్కన పెట్టేసింది.న్యూజిలాండ్ సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు జంబో టీమ్ను పంపనుంది. ఆ జంబో టీమ్లో పలువురు యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. అయితే ఆ లిస్టులో షోయబ్ మాలిక్ పేరు కనిపించలేదు. న్యూజిలాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో షోయబ్ మాలిక్తో పాటు పేసర్ మొహమ్మద్ అమీర్కు చోటు దక్కలేదు.38 సంవత్సరాల సీనియర్ ప్లేయర్ ను పక్కన పెట్టడంతో వచ్చే ఏడాది భారత్లో జరుగనున్న టి20 వరల్డ్కప్లో పాల్గొనేది అనుమానంగా మారింది. పాక్, న్యూజిలాండ్ జట్ల మధ్య డిసెంబర్ 18, 20, 22 తేదీల్లో 3 టి20 మ్యాచ్లు, మౌంట్ మాంగనీ (డిసెంబర్ 26-30), క్రైస్ట్చర్చ్ (జనవరి 3-7) వేదికల్లో రెండు టెస్టులు జరుగుతాయి.టి20 క్రికెట్ మాత్రమే ఆడుతున్న మాలిక్ను జింబాబ్వే సిరీస్కు కూడా పక్కనబెట్టారు. దీంతో క్రికెట్ కెరీర్ ముగిసినట్టేనా..? అంటూ క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.