చాలా కాలంగా ఒకరికొకరు సహకారం అందించుకుంటూ సమన్వయంతో భారత్లో పలుసార్లు విధ్వంసం సృష్టించిన ఐఎస్ఐ-హిజ్బుల్ ముజాహిదీన్ల మధ్య మనస్పర్ధలు,అభిప్రాయ బేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు స్పష్టమవుతోంది.హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దిన్పై గుర్తు తెలియని వ్యక్తుల దాడే అందుకు ప్రత్యక్ష నిదర్శనమని తెలుస్తోంది.ముజాహిదీన్ తో పాటు యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ అనే మరో ఉగ్ర సంస్థకు కూడా సలావుద్దీన్ అధినేతగా ఉన్నాడు. ఈ సంస్థలతో పాటు పాక్ నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తున్న పలు సంస్థలకు ఐఎస్ఐ స్పాన్సర్ చేస్తోంది. అయితే, ఇటీవలి కాలంలో హిజ్బుల్ కు ఐఎస్ఐ తగినంత సపోర్ట్ ఇవ్వడం లేదనే అసహనంతో సలావుద్దీన్ ఉన్నాడు. హిజ్బుల్ కేడర్ కు సరైన ట్రైనింగ్, ఆయుధాలను ఐఎస్ఐ ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహంతో ఉన్నాడు.కశ్మీర్లో హిజ్బుల్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను భారత బలగాలు హతమార్చిన తర్వాత… పాక్ ఆక్రమిత కశ్మీర్లో హిజ్బుల్ కేడర్తో సలావుద్దీన్ సమావేశమయ్యాడు. ఈ సందర్బంగా ఐఎస్ఐపై ఆయన బహిరంగ విమర్శలు గుప్పించాడు.ఈ నేపథ్యంలో సలావుద్దీన్ పై దాడి జరిగిందని భావిస్తున్నారు. దాడికి ప్లాన్ చేసింది ఐఎస్ఐ అని పీవోకేలోని హిజ్బుల్ సీనియర్ కమాండర్ ఒకరు కూడా అభిప్రాయపడ్డాడు. తమ గీతను ఏ ఉగ్రసంస్థ దాటకూడదనే హెచ్చరికలో భాగంగానే ఈ నెల 25వ తేదీన సలావుద్దీన్పై ఐఎస్ఐ అనుచరులు దాడికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దాడి వెనుక ఐఎస్ఐ చీఫ్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే హిజ్బుల్ అధినేత ప్రాణాలు తీయడం దాడి లక్ష్యం కాదని… అతనికి తీవ్రమైన హెచ్చరికను ఇవ్వడమే టార్గెట్ అని తెలుస్తోంది. దాడి జరిగిన వెంటనే సలావుద్దీన్ సురక్షిత స్థావరానికి తరలి వెళ్లాడు.