శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సులలో ఉన్న మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ఇప్పటి వరకు 51 మంది మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారు. ఈ మేరకు కేరళ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది.
మరోవైపు అయ్యప్ప భక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న బిందు, కనకదుర్గల పిటిషన్ను విచారణ జరిపిన ధర్మాసనం వారిద్దరికి రక్షణ కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 24 గంటలు సాయుధులైన పోలీసులు వారిని రక్షణగా ఉంచాలని స్పష్టం చేసింది.
అయితే బిందు, కనకదుర్గలకు ఇప్పటికే భద్రతను కల్పిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం సుప్రీంకు తెలిపింది. జనవరి 2న శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన బిందు, కనకదుర్గలను చంపేస్తామంటూ పలు హిందూ సంస్థలు, అయ్యప్ప భక్తులు హెచ్చరిస్తున్నారు. దీంతో వారిద్దరూ ఆజ్ఞాతంలో గడిపారు. కొద్దిరోజుల క్రితం సొంత ఇంటికి వెళ్లిన కనకదుర్గపై ఆమె అత్త దాడి చేసింది. దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ వీరిద్దరూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.