విజయవాడ: వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ప్రపంచంలోనే అతి పెద్ద బ్రేక్ వాటర్ పోర్టుకు ఏపీ ప్రభుత్వం పునాదిరాయి వేస్తోంది. ఎన్నోమలుపులు తిరిగిన రామాయపట్నం పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. పోర్టుతో పాటు పలు అనుబంధ సంస్థలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.
విభజన చట్టంలో ఇచ్చిన హమీల కేంద్రం నెరవేర్చకపోయినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక్కొక్క హామీని అమలు చేసేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే కడపలో ఉక్కు కర్మాగారానికి శంఖుస్ధాపన చేసిన చంద్రబాబు విభజన చట్టంలో మరో ప్రధాన హామీ దుగరాజపట్నం పోర్టు విషయంలో కేంద్రం విముఖంగా ఉండడంతో రాష్ట్రప్రభుత్వమే వెనుకబడిన ప్రకాశం జిల్లాల్లో రామాయంపట్నం పోర్టుకు శ్రీకారం చుడుతోంది. సుమారు 5వేల కోట్లరూపాయలు పెట్టుబడితో ప్రపంచంలోనే అతి పెద్ద బ్రేక్ వాటర్ పోర్టుగా రామాయపట్నం పోర్టు నిలవనుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యమంత్రి చేతులు మీదుగా భూమి పూజ జరగనున్న ఈ పోర్టు ఈశాన్య ఆసియాదేశాలు, ఆగ్నేయ ఆసియా దేశాల వర్తకానికి సరికొత్త మజిలీ కానుంది.
రామాయపట్నం పోర్టు శంకుస్ధాపనతో పరిసర ప్రాంతాల అభివృద్దితో పాటు ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ మారిటైం ఇన్ప్రాస్ట్రక్చర్ డెవలెప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా నిధులు సమీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనికోసం కాకినాడ రీజియన్ పోర్టులు, మచిలిపట్నం రీజియన్ పోర్టులు నుండే వచ్చే ఆదాయాన్ని రామాయపట్నం పోర్టు నిర్మాణానికి పదేళ్ళపాటు ఉపయోగించాలని నిర్ణయించామని పోర్టు అధికారులు తెలిపారు.
ఈపోర్టు ప్రపంచంలోనే అతి పెద్ద బ్రేక్ వాటర్ పోర్టుగా పేర్కోన్నవారు వివిధ పరిశ్రమలు సైతం పోర్టుతో పాటు అక్కడ నెలకోల్పేందకు ముందుకు వచ్చాయంటున్నారు.. టెండర్లు పిలిచి 2023 నాటికి పోర్టు వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. ఈ పోర్టు కోసం 3500 ఎకరాలు భూమిని 400 కోట్ల రూపాయలతో భూసేకరణ చేస్తామన్న అధికారులు అటు మచిలీపట్నం పోర్టుకు ఈ నెలాఖరుకు శంకుస్ధాపన చేస్తామన్నారు. అటు బ్రేక్ వాటర్, నావిగేషన్ ఛానల్ నిర్మాణానికి 2500 కోట్లు రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్న అధికారులు ఈపోర్టులో రెండు బెర్తులు ఏసియా పేపర్ మిల్లుకు, రెండు బెర్తులు జిందాల్ సంస్ధకు , ఒక బెర్తు రాంకో సంస్ధకు క్యాపిటల్ బెర్తులుగా కేటాయించనున్నారు. మిగిలిన మూడు బెర్తులను కమర్షియల్ బెర్త్లుగా అభివృద్ది చేయనున్నామని ప్రకటించారు. మొత్తం 13 మిలియన్ టన్నుల కెపాసిటీతో ఈ పోర్టును పనిచేయించడానికి ప్రణాళికల రచిస్తున్నామన్నారు.
రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి దొనకొండ ఇండస్ట్రీయల్ క్లస్టర్ తో పాటు నేషనల్ ఇండస్ట్రీయల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మ్యానిఫెక్చరింగ్ జోన్ లకు అతి సమీపంలో ఉంటుందని చెపుతున్నారు. అటు పోర్టుకు అనుబంధంగా ఆసియా పేపర్ మిల్స్ 20 వేలమందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు మెట్ట ప్రాంతాల్లో పండించే సరుగుడు ,జామాయిల్ రైతులకు ఊరట నిచ్చే మంచి ధర లభిస్తుందంటున్నారు. అటు పోర్టుకు అనుబంధంగా స్టీల్ ప్లాంట్ తో పాటు, సిమెంటు పరిశ్రమ కూడా రానుందని చెపుతున్నారు. మొత్తం ఎనిమిది బెర్తులతో నిర్మించే ఈపోర్టు సామర్ధ్యం చాలా ఎక్కువగా ఉండనుందన్నారు. కేంద్రం పరిధిలో ఉండే పోర్టులను మేజర్ పోర్టులు అని, రాష్ట్రం పరిధిలో ఉండే పోర్టులను మైనర్ పోర్టులంటారని అయితే కృష్ణపట్నం లాంటి మైనర్ పోర్టు కోల్కత్తా, చెన్నై పోర్టులను మించి పనితీరును కనబరుస్తుందన్న అధికారులు ఇదే అవకాశం రామాయపట్నంకు వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టకు పెట్టే ఖర్చు 12 సంవత్సరాల్లోనే బ్రేక్ ఈవెన్కు రానుందన్న అధికారులు …సిఆర్ జెడ్ కు 6నెలల్లో అనుమతులు వస్తాయని, పర్యావరణ అనుమతులకు సంవత్సరం పాటు సమయం పడుతుందన్నారు.
కేంద్రం నేరవేర్చని విభజన హామీలను ఛాలెంజ్ గా తీసుకుంటున్న రాష్ట్రప్రభుత్వం ఒక్కోటి టేకప్ చేసి నిర్మాణాలకు సమాయత్తం అవుతుండం పట్ల స్ధానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. తమకు మేలు జరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు.