సిట్రస్ జాతికి చెందిన పండ్లలో నిమ్మపండ్లు కూడా ఒకటి. వీటి నుంచి వచ్చే సువాసన అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. అందుకే పలు రెసిపిలలో, పెర్ఫ్యూమ్లలో నిమ్మ ఫ్లేవర్ వాడుతుంటారు. అలాగే పలు రకాల టీలు, జ్యూస్ల తయారీలోనూ నిమ్మరసాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే నిమ్మలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. విటమిన్ సి ఈ పండ్లలో ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల నిమ్మకాయలు సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటాయి. అలాగే నిమ్మరసాన్ని నిత్యం ఉదయాన్నే ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే దాని వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో వ్యాధులు, ఇన్పెక్షన్లు రాకుండా ఉంటాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపునే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరంలో పీహెచ్ సమతుల్యంలో ఉంటుంది.
2. నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ముఖ్యంగా లివర్ శుభ్రమవుతుంది. జలుబు త్వరగా తగ్గేందుకు నిమ్మరసం ఎంతగానో పనిచేస్తుంది.
3. నిమ్మరసం రోజూ తాగడం వల్ల చర్మంపై ఉండే మొటిమలు, దద్దుర్లు, ముడతలు, కళ్ల కింద ఉండే నల్లని వలయాలు తగ్గుతాయి. చర్మ సౌందర్యం పెరుగుతుంది.
4. అధిక బరువును తగ్గించడంలో, జీర్ణ సమస్యలను తొలగిస్తూ శరీర మెటబాలిజం పెంచడంలో నిమ్మరసం బాగా పనిచేస్తుంది.
5. నిమ్మరసంలో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు శ్వాస కోశ ఇన్ఫెక్షన్లు, గొంతు నొప్పిని తగ్గిస్తాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్లు సమతూకంలో ఉండాలంటే రోజూ నిమ్మరసం తాగాలి.
6. నిమ్మరసం సేవించడం వల్ల కీళ్ల నొప్పుల, కండరాల నొప్పులు తగ్గుతాయి. దంత సమస్యలు ఉండవు. చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.