ఇస్లామాబాద్ : భారత్లో పలు ఉగ్ర వాదుల దాడుల సూత్రదారి, జైషే మహమ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్ పాకిస్థాన్లో ఉన్నట్లు ఆ దేశం అంగీకరించింది. ‘అతడు (మసూద్) మా దేశంలోనే ఉన్నాడు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంటిని విడిచి బయటకు వెళ్లలేని స్థితిలో ఉన్నాడు.మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం మసూద్ అజార్ పాకిస్థానీ జాతీయుడే ’ అని పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి ఒక అంతర్జాతీయ మాధ్యమ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘మసూద్ను పాక్ అరెస్ట్ చేయటానికి భారత్ మాకు సరైన ఆధారాలు అందించాలి. అవి పాక్ న్యాయస్థానాలకు ఆమోదయోగ్యంగా ఉండాలి’ అని చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్ ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. ‘‘తగిన ఆధారాలు ఉంటే దయచేసి కూర్చుని చర్చించుకుందాం. చర్చలను ప్రారంభించండి. మేం సంసిద్ధంగా ఉన్నాం’’ అని భారత్ కు పిలుపునిచ్చారు. పాక్ లోని కొత్త ప్రభుత్వం కొత్త మైండ్ సెట్ తో పని చేస్తోందని, శాంతిని కోరుకుంటోందని తెలిపారు. దేశ ఆర్థి వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ లో గత 17 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధం కూడా అంతం కావాలని తాము కోరుకుంటు న్నామని తెలిపారు. పుల్వామా ఉగ్ర దాడికి తామే బాధ్యులమని ప్రకటించిన జైషే ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ కోరుతోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ భారత్ వాదనల్ని సమర్థించాయి. ఐరాస భద్రత మండలిలో శాశ్వత సభ్య దేశాలైన ఆ మూడు కూడా మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐరాసను గత బుధవారం కోరాయి.