ట్రెండింగ్: అజ్ఞాతంలో మాస్ డైరెక్టర్

  • In Film
  • January 25, 2019
  • 779 Views
ట్రెండింగ్: అజ్ఞాతంలో మాస్ డైరెక్టర్

ఒక కథని తెరపైకి తీసుకురావాలంటే మారిన ప్రేక్షకుడి అభిరుచితో పాటు హీరో రేంజ్ గత ట్రాక్ రికార్డ్ ని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి. అంచనాను అందుకుంటే ఓకే .. లేదంటే విమర్శకుల దాడికి  బలి కావాల్సిందే. ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు బోయపాటి శ్రీను. టాలీవుడ్ లో పక్కా ఊర మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నఆయన పేరు చెబితే ఇప్పుడు స్టార్ హీరోలంతా భయంతో వణికిపోతున్నారట. కథ చెబుతూనే భయాందోళనకు గురచేయడంలో బోయపాటిది అందెవేసిన చెయ్యి అంటూ సెటైర్లు పడుతున్నాయ్.

తన గురించి తెలియని వాళ్లు ఆయనతో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతుంటే తెలిసిన వాళ్లు మాత్రం బాబోయ్ బోయపాటి అంటూ బెంబేలెత్తిపోతున్నారట. నాగార్జునకు కథ చెప్పినా అట్నుంచి సముఖత వ్యక్తం అవ్వకపోగా.. ఆ కాంపౌండ్ నుంచి తీవ్రమైన తిరస్కారం ఎదురైందని ఇటీవల ప్రచారం సాగింది. `వినయ విధేయ రామ`కు ముందే బోయపాటి అక్కినేని కాంపౌండ్ కి కథ వినిపించి రిజెక్ట్ అయ్యాడు. ఇక వీవీఆర్ భారీ డిజాస్టర్ అవ్వడంతో ఈ దర్శకుడు కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందు భారీ డైలాగులు కొట్టిన బోయపాటి రిలీజ్ తరువాత మాత్రం మీడియా అంటే ముఖం చాటేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఎవరికీ కనిపించకుండా పోయిన బోయపాటి ఈ పరాజయాన్నిజీర్ణించుకోలేక అజ్ఞాతంలో వుంటున్నాడట. ఒక్కో సినిమాకి రూ.11కోట్ల పారితోషికం అందుకునే బోయపాటి ఇలాంటి సినిమా తీస్తాడా? అంటూ సన్నిహిత వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ఇప్పటికైనా మూస నుంచి బయటికి వచ్చి మితిమీరిన హింసాత్మక కథల్ని మాసిజాన్ని తగ్గించి కొత్తదనం నిండిన కథల్ని రాసుకుంటాడని ఆశిస్తోంది ఇండస్ట్రీ. మారిన ట్రెండ్ కి తగ్గట్టు మారతాడా.. లేక ఇదే కరెక్ట్ అంటూ మళ్లీ ఊరమాస్ సినిమాలకే ఫిక్స్ అవుతాడా! అంటూ కాస్త ఘాటుగానే చర్చ సాగుతోంది. 

తాజా సమాచారం