అమరావతి : విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన సంస్థలకు గురువారం రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఒప్పందాలను సమీక్షించడానికి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 63ను న్యాయ స్థానం నిలుపుదల చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. యూనిట్ ఛార్జీలు తగ్గించి బకాయి బిల్లు వివరాలు అందించాలని విద్యుత్ సంస్థలను ఏపీఎస్పీడీసీఎల్ కోరింది. టారిఫ్ ధరలు నచ్చకపోతే సంప్రదింపుల కమిటీ వద్ద తమ వైఖరి చెప్పాలని, లేకపోతే ఒప్పందాలను రద్దు చేస్తామని హెచ్చరించినట్లు విద్యుత్ సంస్థలు ఆరోపించాయి. ఈ అంశంపై ఆయా సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి.