హైదరాబాద్ : జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభమైంది. జేబీఎస్ స్టేషన్లో సీఎం కేసీఆర్ జెండా ఊపి మెట్రో రైలు సేవలను ప్రారంభించారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో మార్గాన్ని మొత్తం 11 కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో 9 స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. జూబ్లీ బస్స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్రోడ్డు, సుల్తాన్ బజార్తో పాటు రాష్ట్రంలోనే అతిపెద్ద ఆర్టీసీ బస్టాండ్ ఎంజీబీఎస్ వరకు ఈ మార్గంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో అత్యంత ఎత్తయినదిగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నిలవనుంది. దీన్ని ఐదంతస్తుల ఎత్తులో నిర్మించారు. సికింద్రాబాద్ వైఎంసీ కూడలివద్ద గతంలో నిర్మించిన పైవంతెన ఉండడంతో దానికి సమాంతరంగా నాగోల్-రాయదుర్గం మెట్రో మార్గాన్ని నిర్మించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రెండు నిర్మాణాలపైన కారిడార్- 2లోని జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గంలో దీన్ని 53 అడుగుల ఎత్తులో నిర్మించారు. సుమారు 5 అంతస్తులతో అత్యంత ఎత్తైన ట్రాక్ పై రైలు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.