హోసూరు : లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యాడు. కృష్ణగిరి జిల్లా డెంకణీకోట సమీపంలోని అందేవనపల్లి గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాలుగు వందల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న వినోద్ కుమార్ తోటి మహిళా ఉపాధ్యాయులను, పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయనను సస్పెండ్ చేయాలని అందేవనపల్లి గ్రామ ప్రజలు పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. గ్రామస్థుల డిమాండ్ మేరకు కృష్ణగిరి డీఈవో విచారణ చేపట్టారు. విచారణలో ఉపాధ్యాయుడు వినోద్ కుమార్పై ఆరోపణలు నిజమని తేలడంతో అతన్ని సస్పెండ్ చేశారు.