ముంబయి: ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో!’ అన్న మాట క్రికెట్కి కచ్చితంగా సరిపోతుంది. నిజమే మరి మ్యాచ్లో బంతి బంతికీ కథ మారిపోతుంటుంది. ఇక క్రికెట్ చరిత్రలో ఆఖరి బంతికి ఆరు కొట్టి గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతేడాది నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా బ్యాట్స్మన్ దినేశ్ కార్తిక్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్నందించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇలానే ఓ మ్యాచ్లో ఆఖరి బంతికి సిక్స్ అవసరమైంది. కానీ, వారు సిక్స్ కొట్టకుండానే ఆరు పరుగులు వచ్చాయి. అదెలాగంటే..
ఆదర్శ్ క్రికెట్ క్లబ్(మహారాష్ట్ర) నిర్వహించిన క్రికెట్ పోటీల్లో భాగంగా స్థానిక జట్లైన దేశాయ్- జుని డోంబివ్లి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా జుని జట్టుపై గెలవడానికి దేశాయ్కు 6 పరుగులు కావాల్సివచ్చింది. అయితే, ఒకే బంతి మిగిలి ఉండటంతో ఇటు అభిమానులకు, అటు ఆటగాళ్లకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తీరా మొదటి బాల్ పడింది.. అది కాస్త వైడ్. ఇంకో బంతి పడింది అది కూడా వైడ్! అలా ఆరు వైడ్లు పడడంతో ఆఖరు బంతి ఆడకుండానే ఆరు పరుగులు దేశాయ్ జట్టు ఖాతాలో చేరాయి. మరో బంతి మిగిలి ఉండగానే జుని జట్టుపై దేశాయ్ జట్టు అనూహ్యంగా విజయం సాధించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.