హైదరాబాద్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్ -19 కేసులు దేశంలో చాప కిందనీరులా విస్తరిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలకు దిగింది. జన సందోహాలు లేకుండా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలను ఈ నెల 31 వరకు మూసివేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన ఉన్నత స్థాయి కమిటీ దేశంలో కరోనా ప్రభావం, పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించింది. అనంతరం రాష్ట్రంలో ఈ వైరస్ ప్రభావాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో వివిధ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని మాత్రం యథాతథంగా కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ను మూసివేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే, శాసనసభ బడ్జెట్ సమావేశాలను సైతం కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 20 వరకు ఈ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేపు, ఎల్లుండి సమావేశాలు నిర్వహించి.. సోమవారం ద్రవ్య వినియోగ బిల్లుపై చర్చించి దానికి ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు. మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 83కు చేరింది. ఈ మహమ్మారి సోకి ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి.