కర్ణాటక రాష్ట్రంలోని కావేరి నది తీరాన ఉన్న తలకాడు అనే చిన్న గ్రామం ఎన్నో చారిత్రాత్మక ఘటనలకు, పురాతన దేవాలయాలు,ఆధ్యాత్మిక వింతలకు నిలయంగా విరాజిల్లుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.బెంగళూరు నుంచి 140 కిలోమీటర్ల దూరంలో దట్టబైన అడవుల్లో కావేరి నదీ తీరాన ఉన్న తలకాడు లో ప్రవేశించగానే అక్కడ ప్రవహించే కావేరి నది, చుట్టూ ఉన్న మట్టిని గమనిస్తే నదీ తీరమా ? లేక సముద్ర తీరమా అనే అనుమానం కలుగుతుంది.తలకాడు గ్రామం చాలా చిన్నదే అయినా ఆధ్యాత్మిక వింతలు,చారిత్రాత్మక ఘటనలకు సాక్ష్యంగా నిలిచే పలు పురాతన దేవాలయాలకు కేంద్రంగా భాసిల్లుతోంది. తలకాడులో వైద్యనాథేశ్వర,పాతాళేశ్వర,మరుళేశ్వర,అరకేశ్వర,మల్లికార్జున శివాలయాలు ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు.ఇదే ప్రాంతంలో విష్ణుభగవానుడికి నిర్మించిన కీర్తినాథేశ్వర ఆలయం కూడా ఎంతగానో ప్రసిద్ధి చెందింది.ఐదు శివాలయాలపైకి పాతాళేశ్వర శివాలయం ఎంతో ప్రత్యేకమైనది.క్రీ.శ 1004లో గంగవంశ రాజులు నిర్మించిన పాతాళేశ్వర శివాలయంలో శివలింగం నేలమట్టం కంటే చాలా లోతులో ఉంటుంది. అంతేకాకుండా ఉదయం వేళల్లో ఎరుపు రంగులో,మధ్యాహ్నం వేళల్లో నల్లగా,సాయంత్రం వేళల్లో తెల్లగా కనిపించడం పాతాళేశ్వర శివాలయంలోని శివలింగం ప్రత్యేకత.ఈ వింతను చూడడానికి ప్రతిరోజూ పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.కాలక్రమంలో ఇసుకతో కప్పబడ్డ ఈ శివాలయం చాలా ఏళ్ల క్రితం పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో బయటపడింది.మరో విస్మయకర,బాధాకర విషయం ఏంటంటే ఈ ఐదు శివాలయాలు క్రమక్రమంగా ఇసుకలో కూరుకుపోతున్నాయి.దీంతో వీటిని రక్షించటానికి అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తలకాడు చరిత్రను పరిశీలిస్తే అలమేలు అమ్మవారి శాపం కారణంగా ఇక్కడి శివాలయాలు ఇసుకలో కూరుకుపోతున్నట్లు తెలుస్తోంది.ఒకప్పుడు సుమారు 30 దేవాలయాలు కలిగి ఉన్న తలకాడు ఎంతో ఆకర్షణీయంగా ఉండేది.అయితే మైసూరు రాజవంశస్థులైన ఒడయార్లకు అలిమేలు అమ్మవారు విధించిన శాపం వల్ల 16వ శతాబ్దం నుంచి ఇసుకలో కూరుకుపోతున్నట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది.తలకాడు ప్రాంతాన్ని మొదట్ల గంగవంశస్థులు పరిపాలించగా అనంతరం చోళరాజులు పరిపాలించసాగారు.అయితే చోళులను ఇక్కడి నుంచి తరిమేసిన హొయ్సళ రాజు విష్ణ వర్థనుడు తలకాడును ఆక్రమించుకొని పాలించాడు. తర్వాత ఈ ప్రాంతాన్ని విజయనగర రాజులు వారి తర్వాత వారి మైసూరు ఒడయార్లు పాలించారు.అయితే అలమేలు అమ్మవారి నగలపై కన్ను వేసిన మైసూరు ఒడయర్ రాజు తలకాడుపై తన సైన్యంతో దాడిచేయడంతో అలిమేటు తన నగలను కావేరి నదిలో పడేసి అక్కడే మునిగిపోయిందని చనిపోయే ముందు తలకాడు ఇసుక దిబ్బగా మారిపోవాలని శపించిందని మాలంగి ఒక సరస్సుగాను, మైసూరు రాజులు వారసులు లేకుండా పోతారని శపించిందని స్థానిక కథనాలు.అలిమేలు శాపంతో అప్పటి నుంచి తలకాడు క్రమక్రమంగా ఇసుకలో కూరుకుపోతోందని స్థానికులు ఇప్పటికీ విశ్వసిస్తుంటారు.ఇక దట్టమైన అడవులు,కావేరి నది తీరంతో తలకాడు గ్రామం ఎంతో రమణీయంగా ఉంటుంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పంచలింగ దర్శనం కోసం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు.తలకాడు చుట్టుపక్కల గల సోమనాథపూర్, శివసముద్ర, మైసూర్, శ్రీరంగపట్నం, రంగని తిట్టు మరియు బండిపూర్ ల చూడదగ్గ ఆకర్షణీయమైన ప్రదేశాలు.తలకాడు సందర్శనకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే నవంబర్ నుండి మార్చి వరకు అనుకూలంగా ఉంటుంది.
ఇలా చేరుకోవాలి..
మైసూరు నగరం 43కిలోమీటర్ల దూరంలో ,బెంగళూరు నుండి 120కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకాడుకు చేరుకోవాలంటూ మొదట మైసూరుకు చేరుకోవాలి.అక్కడి నుండి ప్రభుత్వ / ప్రవేట్ వాహనాల్లో తలకాడు చేరుకోవచ్చు. తలకాడు కు సమీపాన 50 కి. మీ ల దూరంలో మైసూర్ రైల్వే స్టేషన్ కలదు.అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో తలకాడుకు చేరుకోవచ్చు..