కుట్రలు చేసినందుకే హరీశ్‌రావు ఈ గతి పట్టింది..

 కుట్రలు,కుతంత్రాలతో శాసనసభ ఎన్నికల్లో ఓడించినందుకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు శిక్ష అనుభవిస్తున్నారంటూ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన సన్మాన సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడారు.త్వరలో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలుపు తీరాలకు చేర్చాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.అందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా పని చేయాలని సూచించారు. శాసనసభ ఎన్నికల్లో కుట్రలు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి కొడంగల్‌లో ఓడించారని ఆరోపించారు. ఇది గమనించిన ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో తెరాసను తొమ్మిది స్థానాలకు పరిమితం చేసి కేసీఆర్‌కు బుద్ధి చెప్పారన్నారు.ప్రశ్నించేవాళ్లు లేకపోతే పాలించేవాళ్లదే రాజ్యమవుతుందని నమ్మిన తనను గెలిపించి ప్రజలు కేసీఆర్‌ గర్వాన్ని అణగదొక్కారన్నారు.శాసనసభ ఎన్నికల్లో కుట్ర పూరితంగా ఓడించినందుకు హరీశ్‌రావు ఇప్పుడు తెరాసలో ప్రాధాన్యత కోల్పోయి శిక్ష అనుభవిస్తున్నారన్నారు. శాసనసభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఓటమే లక్ష్యంగా కేసీఆర్‌,హరీశ్‌రావు వ్యూహాలు రచించారు.రేవంత్‌రెడ్డి అనుచరులను తమవైపు తిప్పుకొని రేవంత్‌రెడ్డిని వ్యూహాత్మకంగా ఓడించారు.ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. పొట్టివాడ్ని పొడుగువాడు కొడితే, పొడుగువాడిని పోశమ్మ కొట్టిందన్నట్లుగా హరీశ్ పరిస్థితి తయారైందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.కుట్రలతో తనను ఓడించిన విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు తనను ఎన్నికల్లో గెలిపించారని వ్యాఖ్యానించారు. తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ కొడంగల్ ప్రజల ఆదరణ, ప్రేమను మర్చిపోనని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఇక కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పార్టీ శ్రేణులు పని చెయ్యాలని దిశా నిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి ..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos